పంజాబ్‌లోని ఖరార్‌ ప్రాంతంలో దారుణం

SMTV Desk 2019-03-30 18:43:14  punjab, Karar, shp license

లుథియానా : పంజాబ్‌లోని ఖరార్‌ ప్రాంతంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోన్న నేహా షోరీ(36)ని ఆమె కార్యాలయంలోనే ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. నేహా షోరీ రోపార్‌ జిల్లా డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వరిస్తున్న సమయంలో 2009లో మోరిండాలోని మెడికల్‌ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బల్వీందర్‌ సింగ్‌ అనే వ్యక్తి దుకాణంలో మాదక ద్రవ్యాలను గుర్తించారు. దీంతో ఆ దుకాణం లైసెన్స్‌ను రద్దు చేశారు. అప్పట్నుంచి ఆమెపై కోపం పెంచుకున్న బల్వీందర్‌.. నేహాను చంపాలని నిర్ణయించుకున్నాడు.

శుక్రవారం ఉదయం నేహా విధులు నిర్వహిస్తున్న కార్యాలయానికి చేరుకున్న బల్వీందర్.. తుపాకీతో ఆమెపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన బల్వీందర్‌ను స్థానికులు అడ్డగించారు. దీంతో తనపై తానే కాల్పులు జరుపుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన బల్వీందర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నేహా కార్యాలయంలోనే ప్రాణాలు కోల్పోగా, బల్వీందర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.