సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి తల్లీబిడ్డా ప్రాణాలు కోల్పోయారు. మృతులను చిన్నారి అయిషా ఖాన్ (5), తల్లి సుయేరా భానుగా గుర్తించారు. బెంగళూరులోని బాగలూరు వద్ద నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న‘రణం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో సుయేరా బాను తన ఐదేళ్ల చిన్నారితో కలిసి షూటింగ్ చూసేందుకు వెళ్లింది. ఆ సమయంలో కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
ఈ సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో సుయేరా బాను, అయిషా ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. గాయపడిన చిన్నారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పేలుడు తర్వాత షూటింగ్ నిలిపేసిన చిత్ర బృందం అక్కడి నుంచి పారిపోయారు. ఈ సినిమాలో చిరంజీవి సర్జా, చేతన్ కుమార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పేలుడు తర్వాత వేరే చిత్రం షూటింగ్లో పాల్గొనేందుకు చిరంజీవి సర్జా మైసూరుకు వెళ్లగా.. చేతన్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.