కేసీఆర్ బాటలోనే జగన్.

SMTV Desk 2019-03-30 18:21:04  jagan,kcr,

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ గజ్వేల్ లోని ఎర్రవల్లిలో రాజశ్యామలం యాగం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపొందేందుకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగేందుకు కేసీఆర్ ఆ యాగం నిర్వహించారు. యాగం అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో 88స్థానంలో గెలుపొంది రెండవ సారి ముఖ్యమంత్రి కూర్చిలో కూర్చున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జగన్ కూడా రాజశ్యామల యాగం నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ యాగాన్ని జగన్ తరపున స్వామి స్వరూపానందేంద్ర నిర్వహించారని, జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ ఎంపీ ఈ యాగాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని సమాచారం. ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన యాగంలో జగన్‌కు దగ్గరి వారు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈ యాగానికి దూరంగా ఉన్నారట. ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్ ఆశిస్తున్నారు. ఇందుకోసం జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.కేసీఆర్ సలహాతోనే జగన్ ఈ యాగం చేస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.