హైదరాబాద్: యంగ్ హీరో నితిన్, ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘భీష్మ’. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించనుంది. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నితిన్ అభిమానులకు చిత్రయూనిట్ సర్ప్రైజ్ ఇచ్చింది. శుక్రవారం నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. భీష్మ- సింగిల్ ఫరెవర్ అనే కాప్షన్తో వచ్చిన ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటోంది.
మహాభారతంలో భీష్ముడిలా బ్రహ్మచారిలా ఉండాలనుకునే ఒక కుర్రాడి కథ చుట్టూ ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. కానీ ఈ పోస్టర్ లో అతని మది నిండా అమ్మాయిలు ఉన్నట్టు చూపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అతిత్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్లో ఎప్పుడెప్పుడు పాల్గొనాలా అని ఆతృతగా ఉందని రష్మిక మందన్న ట్వీట్ చేసింది.