పాక్ రేంజర్లు మోర్టార్ షెల్స్‌తో దాడి

SMTV Desk 2019-03-29 17:14:22  pak rangers,

జమ్ముకశ్మీర్ : సరిహద్దుల్లో పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మళ్లీ ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ ఉదయం 7:30 గంటల సమయంలో పూంచ్ జిల్లాలోని కృష్ణాఘటి సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్లు మోర్టార్ షెల్స్‌తో దాడి చేయడం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ముందస్తు జాగ్రత్తగా సరిహద్దుల ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోవైపు తెల్లవారు జామునుంచే బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా దళాలు.. సుట్స్ గ్రామంలో కూంబింగ్ చేపట్టారు. భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు గాయాలపాలయ్యారు. దీంతో వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.