ప్రీ-క్వార్టర్స్ చేరిన సింధు, శ్రీకాంత్

SMTV Desk 2019-03-29 15:47:41  sindhu, Srikanth,

ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు తమ సత్తా చాటారు. పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, ప్రణయ్‌, సమీర్‌ వర్మలు ప్రీ-క్వార్టర్స్ ఫైనల్ లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో మూడో సీడ్ శ్రీకాంత్‌ 21-16, 18-21, 21-19తో వాంగ్‌ వింగ్‌ విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై విజయం సాధించాడు. ప్రపంచ 37వ ర్యాంకర్‌ విన్సెంట్‌తో చివరి పాయింట్ వరకు హోరాహోరీగా సాగిన పోరులో ఏడో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ కష్టం మీద గట్టెక్కాడు. ఇక సాయిప్రణీత్‌ 22-24, 21-13, 21-8తో కార్తికేయ గుల్షన్‌కుమార్‌పై, సమీర్‌వర్మ 21-18, 21-12తో రస్‌ముస్‌ గెమ్కీ (డెన్మార్క్‌)పై గెలుపొందారు. మరోవైపు గురు సాయిదత్‌ 18-21, 11-21తో సితికోమ్‌ తమసిన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, రాహుల్‌యాదవ్‌ 14-21, 6-21తో జాన్‌ జొర్గెన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడారు.

ఇక మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ సింధు 21-8, 21-13తో ముగ్ధపై సులువుగా నెగ్గింది. రియా ముఖర్జీ 21-17, 21-15తో చైవాన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది.