5000 క్లబ్‌లో విరాట్ కోహ్లీ

SMTV Desk 2019-03-29 12:12:20  Virat Kohli,

రన్ మెషిన్‌గా పిలువబడే విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సాధించాడు. రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు కెప్టెన్‌గా కొనసాగుతోన్న కోహ్లీ గురువారం రాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 46 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌రైనా ఇటీవల ఈ క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లో ఐదు వేల పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు

ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఐదు వేల క్లబ్‌కు 46 పరుగుల దూరంలో ఉన్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, హార్దిక్‌ పాండ్య మెరుపు బ్యాటింగ్‌తో బెంగళూరు ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన బెంగుళూరు 181 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సరిగ్గా 46 పరుగులు చేసి 5000 క్లబ్‌లో చేరాడు. కాగా ఈ మ్యాచ్‌తో ముంబయి మొదటి విజయం సాధించగా బెంగళూరు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది.