యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులే ఉన్నారు. వారిలో రానా దగ్గుబాటి కూడా ఒకరు. తాజాగా రానా తారక్కు అమరచిత్రకథ అనే పుస్తకాల సిరీస్ బహుమతిగా ఇచ్చాడు. ఈ అమరచిత్రకథలో పురాణాలు, వీరగాథలు, చరిత్రలోని గొప్పవ్యక్తుల జీవితాలు, గొప్ప సంఘటనలు, జానపద కథలు కామిక్స్ రూపంలో ఉంటాయి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఈ పుస్తకాలకి చాలామందే ఫాలోవర్లు ఉన్నారు.
దర్శక ధీరుడి రాజమౌళి ‘బాహుబలి’ సినిమా తీయడానికి స్ఫూర్తి ఆ పుస్తకాల ద్వారానే పొందానని ఒక సందర్భంలో అన్నారు. అలాంటి పుస్తకాల్ని తారక్కు ఇచ్చాడు రానా. వాటిని అందుకున్న తారక్ చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయని, వాటి ద్వారా తన బాల్యాన్ని తన కుమారుడు అభయ్ తో కలిసి పంచుకునే ఛాన్స్ దొరికిందని సంబరపడిపోతున్నాడు తారక్.