వివేకానందరెడ్డి హత్యకేసు: పీఏతో సహా ముగ్గురి అరెస్ట్

SMTV Desk 2019-03-28 17:30:20  Vivikananda reddy,

ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో పోలీసులు మరో ముగ్గురు నిందుతుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు ప్రకాష్‌లు ఉన్నారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఈ ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురి అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఈ నెల 15న ఉదయం 8 గంటల సమయంలో వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వివేకానందరెడ్డి చనిపోయారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పులివెందులలో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. తర్వాత శవపంచనామా సమయంలో సాక్ష్యాలు, రక్తపు మరకలు, బంధువుల చెప్పిన దానిని బట్టి హత్యకేసుగా మార్చాము’అన్నారు.

వివేకా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను వీరు తారుమారు చేశారని పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్‌లో ఉన్న వివేకా మృతదేహాన్ని వీరు బెడ్‌రూమ్‌కి తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు…బెడ్‌రూమ్‌లో ఉన్న రక్తపు ఆనవాళ్లను చెరిపేసి సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డికి వివేకా రాసిన లేఖ దొరికినా, సాయంత్రం వరకు దాన్ని పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో పోలీసులు పీఏను కూడా అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టుకు తరలించారు.