పాలమూరులో రేపు ప్రధాని మోడీ బహిరంగసభ

SMTV Desk 2019-03-28 11:29:06  Modi,

ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు.

శుక్రవారం పాలమూరు, నాగర్ కర్నూల్‌లో బిజెపి నిర్వహించబోయే బహిరంగసభలలో ప్రధాని మోడీ పాల్గొంటారు. మళ్ళీ వచ్చే నెల 1వ తేదీన హైదరాబాద్‌, సికిందరాబాద్‌, చేవెళ్ళ, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలలో జరిగే సభలలో పాల్గొంటారు. కుదిరితే ఏప్రిల్ 2,3 తేదీలలో రాష్ట్రంలో మరికొన్ని నియోజకవర్గాలలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారసభలలో పాల్గొనే అవకాశం ఉంది.

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన కూడా ఖరారు అయ్యింది. ఏప్రిల్ 4న కామారెడ్డి, వరంగల్, కరీంనగర్‌లలో జరిగే బహిరంగసభలలో పాల్గొంటారు. ఏప్రిల్ 6న నల్గొండ, హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారు.

యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, స్మృతీ ఇరానీ తదితరులు కూడా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తెరాస కాంగ్రెస్‌, బిజెపిలపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వాటిని తిప్పికొడుతున్నా బిజెపి నేతలు సమర్ధంగా ఎదుర్కొలేకపోతున్నారు. కనుక తెరాస విమర్శలకు, ఆరోపణలకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులు ధీటుగా సమాధానాలు చెప్పడమే కాకుండా తెరాసపై ఎదురుదాడి చేయడం తధ్యం కనుక మోడీ, అమిత్ షా రాకతో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇంకా పెరుగుతుంది.