అహ్మదాబాద్, ఆగస్ట్ 12: ప్రతిపక్షాలు భాజపా మూడేళ్ల పాలనపై గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇటీవల ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ భాజపాకు వ్యతిరేకంగా ఈ నెల 27న ర్యాలీ చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సైతం సెప్టెంబర్ 1న గుజరాత్లో సత్యాగ్రహ ర్యాలీని చేపట్టేందుకు సిద్ధమైంది. గిరిజనులపై దాడులను నిరసిస్తూ ఈ ర్యాలీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. సత్యాగ్రహ ర్యాలీ కోసం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సంవత్సరం చివర్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోఈ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నిరసనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వం వహించనున్నారని సమాచారం.