తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ తనకంటూ ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్న జానీ మాస్టర్ ఇప్పుడు జైలుకు వెళ్లబోతున్నారు. జానీ మాస్టర్ 2015లో ఓ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. 2015 సంవత్సరంలో సెక్షన్ 354, 324, 506 కింద జానీ మాస్టర్పై కేసు నమోదు కాగా…ఇన్నాళ్లకు దీనిపై తుది తీర్పు వచ్చింది. చెక్ బౌన్స్ కేసుతో పాటు మరిన్ని కేసులు ఆయనపై ఉన్నట్లు సమాచారం. అయితే సెక్షన్ 354 కేసుని కొట్టివేసి… 324, 506 సెక్షన్స్ మాత్రం నిజమే అని నిర్థారించింది మేడ్చల్ కోర్టు. దీంతో ఈయనకు 6 నెలల శిక్ష విధిస్తూ తీర్పును ప్రకటించింది. జానీ మాస్టర్తో పాటు మరో ఐదుగురిని కూడా జైలుకు తరలించాలని మేడ్చల్ కోర్ట్ ఆదేశించింది.
2015లో మేడ్చల్ మండలం కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఈవెంట్లో జానీ మాస్టర్ తన టీంతో కలిసి పాల్గొన్నారు. అయితే ఓ పాట విషయంలో జానీ మాస్టర్ టీమ్కి మరో టీమ్కి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో డ్యాన్స్ మాస్టర్ జానీ బృందం తమపై దాడికి పాల్పడ్డారని మరో బృందం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జానీ మాస్టర్తో పాటు మరో ఐదుగురిని ముద్దాయిలుగా చేర్చారు. 2015 నుండి మేడ్చల్లోని సివిల్ కోర్టులో ఈ కేసు విచారణ జరగగా నేడు తీర్పు వెలువడింది. సుదీర్ఘ వాదనల అనంతరం.. దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్ జానీతో పాటు మరో ఐదుగురిని నిందితులుగా గుర్తించింది కోర్టు. దీంతో ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్షతో పాటు 1500 రూపాయల జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని మేడ్చల్ సిఐ గంగాధర్ తెలిపారు.