వైరల్ అవుతున్న మంచు లక్ష్మి ట్వీట్

SMTV Desk 2019-03-27 11:13:32  Manchu laksmi.

ఇటీవల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యంపై తిరుపతిలో ర్యాలీ చేపట్టిన నటుడు, విద్యావేత్త మోహన్ బాబు మంగళవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోహన్ బాబుతోపాటు ఆయన కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మి.. జగన్‌ని లోటస్ పాండ్‌లో కలిశారు.

కాగా, మోహన్ బాబు వైసీపీలో చేరడం పట్ల ఆయన కూతురు, నటి మంచు లక్ష్మీ స్పందించారు. ‘జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దానిని రీట్వీట్ చేస్తూ..‘అండ్ దిస్ జస్ట్ హ్యాపెండ్.. ఆల్ ది వెరీ నాన్నా’ అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఆల్ ది వెరీ బెస్ట్ నాన్నా అనే బదులు తొందరలో ఆల్ ది వెరీ నాన్న అని లక్ష్మీ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అవును వెర్రీ నాన్నే అని కొందరు కామెంట్లు పెట్టగా. మరికొందరేమో బెస్ట్ మిస్సయ్యిందని సూచిస్తున్నారు. వెంటనే అలెర్ట్ అయిన ఆమె.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయితే మంచు లక్ష్మి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురికావడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు ఆమెను నెటిజన్లు ట్రోల్ చేసారు. మీడియా ముందు, వివిధ కార్యక్రమాలలో ఇంగ్లీష్‌లోనే మాట్లాడడానికి ఇష్టపడే ఆమె ఇప్పుడు ఇంగ్లీష్‌ లో ట్వీట్ చేస్తూ తప్పు చేయడంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ విషయమైన ఆమె స్పందించలేదు.