CSK vs DC : నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్

SMTV Desk 2019-03-26 17:05:01  csk vs dc, ipl 2019, mahendra singh dhoni, rishab pant

న్యూఢిల్లీ, మార్చ్ 26: ఐపీఎల్‌ 2019 సీజన్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. ఈరోజు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అలవోకగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్‌తో.. ముంబయి ఇండియన్స్‌ని మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ జట్టు రాత్రి 8 గంటలకి ఢీకొనబోతోంది. ముంబయి బౌలర్లని వారి సొంతగడ్డపైనే ఉతికారేసిన రిషబ్ పంత్ ( 78 నాటౌట్: 27 బంతుల్లో 7x4, 7x6) సూపర్ ఫామ్‌లో ఉండటంతో చెన్నై కెప్టెన్ ధోనీ తన వ్యూహాలతో అతడ్ని మ్యాచ్‌లో ఎలా నిలువరిస్తాడో..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఐపీఎల్‌ 2019 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే బెంగళూరుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్.. స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9), జడేజా (2/15) రాణించడంతో ఆ జట్టుని 17.1 ఓవర్లలో కేవలం 70 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని అంబటి రాయుడు (28: 42 బంతుల్లో 2x4, 1x6) నిలకడగా ఆడటంతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో.. ఆ గెలుపు జోరుని కొనసాగించాలని చెన్నై ఉవ్విళ్లూరుతోంది. ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (43: 36 బంతుల్లో 4x4, 1x6) ఆ జట్టుకి శుభారంభమివ్వగా.. మిడిల్ ఓవర్లలో ఇంగ్రామ్ (47: 32 బంతుల్లో 7x4, 1x6).. స్లాగ్ ఓవర్లలో రిషబ్ పంత్ బ్యాట్ ఝళిపించేశారు. దీంతో.. ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా.. రిషబ్ పంత్.. ముంబయి అగ్రశ్రేణి బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ రెండు సిక్సర్లు బాది ప్రత్యర్థులకి గట్టి హెచ్చరికలు పంపాడు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లూ సత్తాచాటి ముంబయిని 176కే పరిమితం చేశారు.