న్యూఢిల్లీ, మార్చ్ 26: టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ వల్ల బిజీగా ఉన్న క్రికెటర్లకి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఐపీఎల్ లో దాదాపు 150 మందికిపైగా భారత క్రికెటర్లు (టీమ్, రిజర్వ్ బెంచ్) ఈ టోర్నీలో ఆడుతున్నారు. మ్యాచ్ల షెడ్యూల్లో భాగంగా వివిధ నగరాలకి టీమ్స్ మారాల్సి ఉండటంతో.. పోలింగ్ రోజు సొంత నియోజకవర్గానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేకపోవచ్చు. దీంతో.. తాము పోలింగ్ రోజు ఎక్కడ ఉంటే..? అక్కడ ఓటు వేసే అవకాశం కల్పించాలని మోదీని అశ్విన్ కోరాడు. ఈనెల 23న ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభమవగా.. మే 5 వరకూ లీగ్ దశ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ లీగ్ దశలో టోర్నీలోని 8 జట్లూ.. సొంతగడ్డపై 7 మ్యాచ్లు, ప్రత్యర్థి వేదికలపై 7 మ్యాచ్లు ఆడనున్నాయి. మరోవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ మొత్తం ఏడు దశలో జరగనుండటంతో.. ఓటు వినియోగంపై క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మోదీతో పాటు ఎన్నికల సంఘం కూడా స్పందించాల్సి ఉంది.