ఆసీస్‌ సిరీస్‌లో జరిగిందంతా మన మంచికే

SMTV Desk 2019-03-26 13:05:37  Dravid, India,

ముంబయి: ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియా చేతిలో 2-3 తేడాతో సిరీస్‌ ఓటమి టీమిండియాకు హెచ్చరిక అని ఇండియన్ టీం మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత్‌-ఏ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. అయితే దేశ, విదేశాల్లో నిర్విరామంగా విజయాలు సాధిస్తున్న భారత్ జట్టకు తాజా ఓటమి మంచే చేసిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

‘మనం వరల్డ్‌కప్ సులభంగా అందుకుంటామని ప్రచారం జరుగుతోంది. ఆసీస్‌ సిరీస్‌లో జరిగిందంతా మన మంచికే. మెగా టోర్నీని క్రమశిక్షణతో, చాలా శ్రద్ధగా ఆడాలని ఆసీస్‌ ఓటమి గుర్తుచేస్తుంది. రెండేళ్లుగా భారత్‌ నిలకడగా రాణించింది. జట్టు సమతూకంగా ఉంది. అందుకే మనం ప్రపంచకప్‌ను సులభంగా అందుకుంటామని ప్రచారం జరుగుతోంది. ఆసీస్‌ సిరీస్‌ చూసిన తర్వాత నాకు వింతేమీ కనిపించలేదు. మనం ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాం. కానీ అక్కడ పోరు, ఒత్తిడి తీవ్రంగా ఉంటాయి’ అని ద్రవిడ్‌ అన్నారు.

ఐపీఎల్‌లో ఆటగాళ్ల పనిభారంపై మిస్టర్‌ డిపెండబుల్‌ మాట్లాడారు. క్రికెటర్లకు విశ్రాంతినివ్వాలని ఫ్రాంచైజీలకు సూచించొద్దని పేర్కొన్నారు. ‘వారి శరీరాల గురించి ఆటగాళ్లకు బాగా తెలుసు. క్రమం తప్పకుండా ఆడితేనే తన బౌలింగ్‌ లయ బాగుంటుందని కమిన్స్‌ రాసిన కథనం చదివాను. పనిభారం ఒక్కో ఆటగాడికి ఒక్కోలా ఉంటుంది. అందరికీ విశ్రాంతి ఇవ్వాల్సిన పనిలేదు. ఆటగాళ్లను విశ్వసించాలి. ఏం చేయాలో వారికి తెలుసు’ అని ద్రవిడ్‌ తెలిపారు.