ఐపీఎల్ మొదలై కొన్ని రోజులు కూడా కావడం లేదు అప్పుడే వివాదాలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ని ‘మన్కడింగ్’ ద్వారా రనౌట్ చేయడంపై పంజాబ్ సారధి అశ్విన్పై నెటిజన్లు దుమ్మేస్తిపాస్తున్నారు. 43 బంతుల్లో 69 పరుగులు చేసి రాజస్థాన్ జట్టుని విజయం దిశగా నడిపిస్తున్న జోస్ బట్లర్ని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా అశ్విన్ రనౌట్ చేశాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బౌలింగ్ చేస్తున్న అశ్విన్ ఆఖరి క్షణంలో బంతిని విసరడం ఆపేసి.. నాన్స్ట్రైక్ ఎండ్లోని బెయిల్స్ను పడగొట్టాడు. దీంతో.. అప్పటికే క్రీజు వెలుపలికి వెళ్లిన బట్లర్ ‘మన్కడింగ్’ రనౌటయ్యాడు.
అయితే.. క్రికెట్ నిబంధనల ప్రకారం.. కనీసం ఒక్కసారైనా.. ‘మన్కడింగ్’పై బౌలర్ హెచ్చరించాలి. కానీ.. అశ్విన్ అలా చేయకుండా అనైతికంగా వ్యవహరించి బట్లర్ని ఔట్ చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు.. క్రిస్గేల్ 47 బంతుల్లో 79 పరుగుల మెరుపు అర్ధశతకం సహాయంతో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ని 170/9కే పరిమితం చేసింది. ఛేదనలో జోస్ బట్లర్ మెరుపులు మెరిపించడంతో.. ఒకానొక దశలో 148/2తో రాజస్థాన్ రాయల్స్ అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. బట్లర్ ఔట్ తర్వాత ఒత్తిడికి గురైన ఆ జట్టు కేవలం 16 పరుగుల వ్యవధిలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి ఓడిపోయింది. దీనితో రాజస్థాన్ ఓడిపోవడానికి అశ్విన్ అనైతిక చర్యే కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన అశ్విన్.. క్రికెట్ రూల్స్ ప్రకారం నేను చేసింది సరైన చర్యేనని సమర్థించుకున్నాడు.