వాళ్లను తిరిగి తమ కుటుంబాలకు అప్పగించాలి

SMTV Desk 2019-03-26 11:24:44  Sushma Swaraj

పాకిస్థాన్‌లో హిందూ మతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను గత వారం కిడ్నాప్ చేసి... బలవంతంగా మత మార్పిడి చేయించారన్న అంశం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండగా... తాజా అంశం భారత్ ఆగ్రహానికి కారణమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని పాకిస్థాన్‌లోని భారత రాయబారిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా దీనికి సంబంధించి ఓ రిపోర్ట్... పాకిస్థాన్‌లోని భారత రాయబారి నుంచీ కేంద్ర ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది. ఆ రిపోర్టులో వివరాల్ని చూసిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ట్విట్టర్‌లో ఉతికారేశారు.

రవీనా వయసు 13 ఏళ్లు, రీనా వయసు 15 ఏళ్లు. ఆ వయసులో వాళ్లు మతాలు మార్చుకోవాలని ఆలోచించుకోగలరా? వాళ్లకు పెళ్లి చేసి, మతం మార్పించడం న్యాయం ఎలా అవుతుంది? అలాంటి నిర్ణయం ఆ బాలికలు స్వయంగా తీసుకున్నారంటే కొత్త పాకిస్థాన్ ప్రధాని నమ్ముతున్నారా? వాళ్లకు న్యాయం జరగాలి. వాళ్లను తిరిగి తమ కుటుంబాలకు అప్పగించాలి అని డిమాండ్ చేశారు సుష్మా స్వరాజ్.

పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో హోలీ రోజున అక్కాచెల్లెళ్లు కిడ్నాపయ్యారు. ఘోట్కీ జిల్లా ధర్కి పట్టణంలో జిల్లాలో రవీనా, రీనాలను ఇంటి నుంచే కొందరు వ్యక్తులు ఎత్తుకుపోయారు. తర్వాత వాళ్లకు పెళ్లి చేసి ముస్లిం మతంలోకి మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. హిందూ బాలికల్ని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. ఇప్పుడు పాకిస్థాన్ తీసుకునే చర్యల్ని బట్టీ భారత్ నెక్ట్స్ స్టెప్స్ ఉండే అవకాశాలున్నాయి.