పల్లెకేలే , ఆగస్ట్ 12: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్ లో గత రెండు మ్యాచ్లలో ఆతిథ్య జట్టును టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మూడో మ్యాచ్ నేటి ఉదయం పల్లెకేలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైనది. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు సారథి కోహ్లి రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ను ఎన్నుకున్నాడు. అయితే బ్యాటింగ్ ఎంచుకోవడం వెనుక విదేశాల్లో మొదటిసారి టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే ఆలోచనలో టీమిండియా జట్టు ఉన్నట్లు తెలుస్తుంది. టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్ మాట్లాడుతూ మంచి బ్యాటింగ్ కండిషన్స్ ను ఉపయోగించుకోవాలనుకుంటున్నామని వెల్లడించాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు నిషేధానికి గురైన జడేజా స్థానంని యాదవ్ భర్తీ చేశాడు. తాము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నామని శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్ అన్నారు. శ్రీలంక జట్టులోకి లక్షణ్ సందకన్, లాహిరు కుమారా, విశ్వ ఫెర్నాండోలు వచ్చారు. గాయపడ్డ నువాన్ ప్రదీప్, ధనంజయ డీ సిల్వా, హెరాత్ లు జట్టుకు దూరమయ్యారు.