బీజింగ్, ఆగస్ట్ 11: ఇటీవల కాలంలో తరచూ భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న చైనా తాజాగా మరోసారి ఇండియాపై తీవ్ర దుమారం రేపే విధమైన వ్యాఖ్యలు చేసింది. భారత్ ఇప్పట్లో తయారీ రంగంలో చైనా చేరుకోవడం జరిగే పని కాదని ప్రకటించింది. భారత్ ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు చాలా ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేసింది. అయితే భారత్కు ఓ అడ్డదారి ఉందంటూ ఓ ఉచిత సలహాను ఇచ్చింది. భారత్ సులువుగా విదేశీ పెట్టుబడులతో గ్లోబల్ మానుఫ్యాక్చరింగ్ హబ్గా పరిణితి చెందవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. మా దేశం తయారు చేసే వస్తువులు తక్కువ ధరకు లభించడం వల్ల వాటిని వాడేందుకు ఇండియన్లు ఎగబడుతున్నారని వెల్లడించింది. డోక్లాం ఉద్రిక్తతల నేపధ్యంలో తమ దేశ వస్తువులను ఉపయోగించవద్దని భారత్లోని కొందరు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.