వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్ధి పార్టీలు తనపై చేస్తున్న విమర్శలను స్పష్టమైన సమాధానాలతో తిప్పికొట్టడంతోపాటు తాను అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులను వైఎస్ జగన్ సవివరింగా ప్రజలకు చెబుతున్నారు.
కాగా, వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీ విభజనను అదునుగా భావించిన చంద్రబాబు దోచుకునేందుకు సమయం లేదు మిత్రమా..! అనే రీతిలో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ లక్షల కోట్ల నగదును తమ ఖాతాల్లో వేసుకున్నారన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు చేయని అవినీతి పని అంటూ లేదని, మరుగుదొడ్ల నిర్మాణం నుంచి ప్రాజెక్టుల నిర్మాణం వరకు ప్రతీ పనిలోనూ అవినీతిని వ్యాపింప చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్ జగన్ అన్నారు.
ఆఖరకు ప్రజా వ్యవస్థను కూడా చంద్రబాబు తన సొంత పనులను వాడుకున్నారని, ఆ క్రమంలోనే కొందరు పోలీసులకు ఖాకీల చేత పచ్చ చొక్కాలు తొడిగించారన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పచ్చ చొక్కాలను తొలగించి వారు ఎవరికింద పనిచేయకుండా స్వతంత్రులుగా విధులు నిర్వహిస్తూ న్యాయ వ్యవస్థను కాపాడేలా చొరవ చూపుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
అంతేకాకుండా, నిత్యం విధులతో మైండ్ స్ట్రెస్కు గురయ్యే పోలీసు శాఖ వారికి ప్రతీ వారంలో ఒక వీక్ ఆఫ్ ఇస్తామని, హోంగార్డులకు జీతాలు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై, రోడ్ల పక్కన చిరు వ్యాపారాలను నిర్వహించే వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, ఆ గుర్తింపు కార్డులను చూపి బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలు తీసుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు.