కర్ణాటకలోని మాండ్య లో రసవత్తర రాజకీయాలు

SMTV Desk 2019-03-25 17:29:53  karnataka, Mandya,

కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలవగా...జేడీఎస్ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. నిఖిల్ గౌడ విజయం కోసం జేడీఎస్ నేతలు ఇక్కడ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అటు మాండ్యాకు చెందిన స్థానిక కాంగ్రెస్ నేతలు సుమలత అంబరీష్‌కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు సుమలతకు మద్దతివ్వడం పట్ల జేడీఎస్ నేతలు కుతకుతలాడుతున్నారు.

సుమలతకు మద్దతు ప్రకటించిన బీజేపీ...మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో మాజీ సీఎం యడ్యూరప్పను సుమలత మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మాండ్య లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తనకు మద్దతుగా ప్రచారం చేయాలని యడ్యూరప్పను ఆమె ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సుమలత గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చారు.

మాండ్యలో సుమలత అంబరీష్‌కు ఇటు బీజేపీ, అటు స్థానిక కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలవడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.