శుభారంభం కోసం ఎదురుచూస్తున్న RR, KXIP

SMTV Desk 2019-03-25 17:28:42  rajasthan royals, kings punjab, ipl 2019

జైపూర్‌, మార్చ్ 25: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికర మ్యాచ్‌ కు రంగం సిద్ధమైంది. రాజస్థాన్‌ తో పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌ జైపూర్‌ వేదికగా ఇవాళ రాత్రి తలపడబోతున్నది. తొలి మ్యాచ్‌ లో గెలిచి.. టోర్నమెంట్‌ లో శుభారంభం చేయాలని రెండు జట్లు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. యేడాది నిషేధం తర్వాత.. ఈ మ్యాచ్‌ తోనే బరిలోకి దిగుతున్నాడు. వార్నర్‌ లా.. స్మిత్‌ కూడా చేలరేగి ఆడాలని రాజస్థాన్‌ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. గత సీజన్‌ లో పేలవ ఆటతీరుతో.. ఫైనల్‌ వరకూ చేరుకోలేని రాజస్థాన్‌, పంజాబ్‌ ఈ సారి కప్‌ ఎలాగైన గెలవాలనే కసితో ఉన్నాయి. అజింక్యా రహానే సారథ్యంలోని రాయల్స్‌ టీమ్‌ లో.. స్టీవ్‌ స్మిత్‌ తో పాటు జోస్ బట్లర్‌, బెన్ స్టోక్స్‌, సంజు శాంసన్‌, జోఫ్రా అర్చర్‌ తో పటిష్టంగా ఉన్నది. అటు స్పిన్నర్‌ అశ్విన్‌ నాయకత్వంలోని పంజాబ్‌.. బౌలింగ్‌ తో పాటు బ్యాటింగ్‌ లోనూ పటిష్టంగా కనిపిస్తున్నది. విండీస్‌ స్టార్‌ క్రిస్‌ గేల్ తో పాటు కేఎల్‌ రాహుల్‌, కరుణ్ నాయర్, మయాంక్‌ అగర్వాల్‌, అండ్రూ టై, ముజీబుర్‌ రెహమాన్‌తో పంజాబ్‌ టీమ్‌ కళకళలాడుతున్నది. తొలి మ్యాచ్‌ లో ఆల్‌ రౌండ్‌ పర్‌ ఫామెన్స్‌ తో రాణించి.. టోర్నమెంట్‌ లో రాణించాలని రెండు టీమ్‌లు కోరుకుంటున్నాయి. అటు రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉండటంతో.. మ్యాచ్ రసవత్తరంగా సాగనున్నది.