పెద్దపల్లి లోక్సభ టికెట్ ఆశించి భంగపడిన జి. వివేక్ “సిఎం కేసీఆర్ నన్ను పక్కనే కూర్చొబెట్టుకొని గొంతుకోశారని” తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ సమాధానం చెప్పారు.
“తనకు సిఎం కేసీఆర్ చాలా ప్రాధాన్యం ఇచ్చారని వివేక్ స్వయంగా చెప్పుకొన్నారు. కానీ అంత ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ఆయన పార్టీకి ద్రోహం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో బెల్లంపల్లిలో తెరాస అభ్యర్ధిపై తన సోదరుడిని నిలబెట్టారు. ఇతర నియోజకవర్గాలలో కూడా పార్టీ అభ్యర్ధులను ఓడించేందుకు వివేక్ చాలా కుట్రలు చేశారు. ఇవన్నీ మేము సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వివేక్పై చర్యలు తీసుకోవాలని కోరాము. మా అభిప్రాయాలతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబందించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొన్న సిఎం కేసీఆర్, వివేక్కు టికెట్ ఇవ్వలేదు. వివేక్ తాను దళితుడినని చెప్పుకొంటారు. కానీ తన ఆస్తులు పెంచుకోవడం తప్ప దళితుల కోసం ఆయన ఏమి చేశారో చెప్పగలరా? ఆయన దళితుడు కాదు...ధనికుడు. దళితులకు, పార్టీకి ద్రోహం చేసిన ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం సరైన నిర్ణయమేనని నేను భావిస్తున్నాను,” అని బాల్క సుమన్ అన్నారు.