నంద్యాల, ఆగస్ట్ 11: గత కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబు - ఏపీ ప్రతిపక్షనేత జగన్ల మాటల యుద్ధం నడుస్తుంది. కాగా నంద్యాల ఉపఎన్నికల పర్వంలో ఇది మరింత పెరిగింది. తాజాగా నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ... ఇసుక, మట్టి, గుడి భూములు, రాజధాని భూమి ఇలా దేన్నీ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టలేదని, అన్నింట్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతీ సినిమాలో ప్రారంభం నుండి చివరి వరకు విలన్ విజయం సాధిస్తే, అంతిమ విజయం మాత్రం హీరో నే వరిస్తుందన్నారు. అలాగే, భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఏది చదివినా అన్యాయం చేసే వారిదే చివరివరకు పై చేయిగా ఉండి, అంతిమంగా మాత్రం న్యాయం, ధర్మమే గెలుస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన విజయం మాదే అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో మూడేళ్లు గా అన్యాయం రాజ్యమేలుతోందని, ప్రజలు ఓటుతో అన్యాయ పాలనకు అంతిమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. పాపానికి ఓటు వేయండని ఏ దేవుడు బోధించడని ఆయన వ్యాఖ్యానించారు.