త్రీడీలో రాజధానిని చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు

SMTV Desk 2019-03-25 17:17:27  Sharmila, chandra babu

చంద్రబాబు పాలనలో ఏపీ 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తోందా అంటూ మండిపడ్డారు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల. త్రీడీలో రాజధానిని చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని, రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు కానీ హైదరాబాద్‌లో మాత్రం చంద్రబాబు పర్మినెంట్ ఇల్లు కట్టుకున్నారని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో 600హామీలు ఇచ్చిన చంద్రబాబు, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు.

బాబు వస్తే జాబ్ వస్తుందంటూ అప్పట్లో బాగా ప్రచారం చేశారని.. కానీ బాబు అధికారంలోకి వచ్చాక లోకేశ్‌కు తప్ప ఎవరకీ జాబ్ రాలేదని చెప్పారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని లోకేశ్‌కు మూడు మంత్రిత్వ శాఖలను కట్టబెట్టారని విమర్శించారు. ప్రజల డేటా చోరీ చేశారని, డేటా చోరి చేసిన వారిపై చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటూ షర్మిల ప్రశ్నించారు.

హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు తీర్మానం చేశారని.. బాబు- మోదీ జోడీ కలిసి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారని షర్మిల దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో అవినీతి పెరిగిపోయిందని.. లంచగొండితనం, దౌర్జన్యాన్ని చంద్రబాబు ప్రోత్సహించారని ఆమె విమర్శించారు. ఇరిగేషన్ నుంచి ఇన్‌ఫ్రా వరకు అవినీతి పెరిగిపోయిందని షర్మిల అన్నారు. వెన్నుపోటులో చంద్రబాబుకు మంచి అనుభవం ఉందని, బాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని చెప్పారు.

ఇక వైఎస్ఆర్ హయాంలో పేద కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేదని, రైతు ఆనందంగా ఉండేవాడని, అన్ని వర్గాలకు వైఎస్‌ఆర్ మేలు చేశారని ఆమె గుర్తు చేశారు. ఈ ఎన్నికలు ఏపీ ప్రజలకు కీలకం అని ఆమె పేర్కొన్నారు.