లేడీ సూపర్స్టార్ నయనతారపై ప్రముఖ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార ‘కొలైయుదిర్ కాలమ్’లో నటించింది. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్ర ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. దీనికి అతిథిగా హాజరైన రాధారవి మాట్లాడుతూ నయన్పై కామెంట్లు చేశారు.
‘‘నయనతార మంచి నటి. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటా. ఇండస్ట్రీలో ఆమె చాలా కాలంగా పనిచేస్తున్నారు. తన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయినా ఇంకా టాప్లో కొనసాగుతోంది. తమిళ ప్రజలు ఏ విషయాన్నైనా నాలుగైదు రోజుల్లో మరిచిపోతారు. తను ప్రస్తుతం ఫేమస్ కావచ్చు. తనే సీత పాత్ర చేసింది. ఇప్పుడు దెయ్యాలు పాత్రలు చేస్తోంది. ఒకప్పుడు దేవుళ్ల పాత్రలలో నటించాలనే కేఆర్ విజయ దగ్గరకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు? ఎవరైనా చేయొచ్చు. గౌరవప్రదమైన వాళ్లైనా చేయొచ్చు, ఎవరెవరితో తిరిగేవాళ్లైనా నటింపచేయొచ్చు. ఈ మధ్య నయనతార ఎక్కువగా హారర్ సినిమాలలో నటిస్తోంది. తనను చూస్తూ దెయ్యాలే పారిపోతాయి’’ అంటూ కామెంట్లు చేశారు.