కేసీఆర్ ఇకనైనా తప్పుడు విధానాలు మానుకోవాలి

SMTV Desk 2019-03-25 12:43:27  kcr, ap cm

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జగన్, కేసీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ సహకారంతోనే జగన్ విర్రవీగుతున్నాడని ఆరోపించారు.

తుఫాన్లు, ఆర్థిక ఇబ్బందుల కంటే.. ఏపీకి జగనే అత్యంత ప్రమాదం అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులను టీఆర్ఎస్ బెదిరింపులకు గురిచేస్తోందని.. వైసీపీలోని కొంతమంది పెద్ద నేతలే స్వయంగా ప్రలోభాలకు దిగారని ఆరోపించారు. ఆఖరికి టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం రాత్రిపూట ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో వ్యాపారాలు, ఆస్తులు ఉన్న అభ్యర్థులను పార్టీ మారేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని.. అందుకే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆఖరి నిమిషంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారని అన్నారు. త్వరలోనే టీఆర్ఎస్, వైసీపీల ప్రలోభాలను ఆధారాలతో సహా బయటపెడుతామని చెప్పారు.కేసీఆర్ ఇకనైనా తప్పుడు విధానాలు మానుకోవాలని.. లేదంటే హైదరాబాద్‌లోనే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.