ఇస్లామాబాద్, మార్చ్ 24: పాకిస్తాన్ లో హిందూ బాలికలను కిడ్నాప్ చేసి వారిని మతమార్పిడి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పాక్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. హోళీ పండుగ జరుపుకుంటున్న ఒక హిందువు ఇంట్లోకి దుండగులు చొరబడి ఇద్దరు అక్కాచెల్లెలు రీనా(15), రవీనా(13)ను ఎత్తుకెళ్లారు. అనంతరం వారిని మతమార్పిడి చేయించి వివాహం జరిపారు. వివాహం తంతు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మైనార్టీలు మండిపడుతున్నారు. అంతేకాక ఈ ఘటనను వ్యతిరేకిస్తూ హిందువులు భారీగా ర్యాలీ చేపట్టారు. దీంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వీడియోలో రీనా, రవీనా మాట్లాడుతూ తమను ఎవరు బలవంతంగా మత మార్పిడి చేయించలేదని తాము ఇష్టపూర్వకంగా ఇస్లాం మతంలో చేరామని, తాము వివాహం చేసుకున్నామని వివరించారు.