ఆర్సీబీ చెత్త రికార్డ్

SMTV Desk 2019-03-25 12:27:11  rcb, ipl 2019, csk

మార్చ్ 24: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెత్త రికార్డుని సృష్టించింది. ఐపీఎల్ 2019 సీజన్లో ప్రారంభ మ్యాచ్ సీఎస్కే vs ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేవలం 70 పరుగులకే ఆలౌటైన బెంగళూరు.. పదేళ్లలో ఇలా ఆరంభ మ్యాచ్‌లోనే తక్కువ స్కోరుకి ఔటైన తొలి జట్టుగా రికార్డుల్లో నిలిచింది. స్పిన్నర్లకి అతిగా అనుకూలించిన చెపాక్ పిచ్‌పై చెలరేగిన చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా.. 17.1 ఓవర్లలోనే బెంగళూరుని కుప్పకూల్చగా.. లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో 71/3తో చెన్నై సూపర్ కింగ్స్ ఛేదించింది. 2019 ఐపీఎల్‌ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఇలా తక్కువ స్కోర్లు నమోదవడంతో.. చెన్నై కెప్టెన్ ధోని సైతం పిచ్‌ తీరుపై పెదవివిరిచాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 82 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే రెండుసార్లు 100లోపు ఆలౌటైన తొలి జట్టుగా బెంగళూరు చెత్త రికార్డుల్లో నిలిచింది. అంతేకాకుండా.. బెంగళూరు టీమ్‌లోని పది మంది బ్యాట్స్‌మెన్స్ సింగిల్ డిజిట్‌కే ఔటవడం టోర్నీ చరిత్రలో ఇది మూడోసారి.