ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్లో ఆదివారం ఉదయం కన్ను మూశారు. ఆలిండియా రేడియో ద్వారా తెలుగు జానపద గీతాలకు అనసూయా దేవి ఎనలేని ప్రాచుర్యం కల్పించిన విషయం తెలిసిందే. జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయా ప్రసిద్ధిగాంచారు. అనసూయాదేవికి హార్మోనియం వాయించడంలోనూ మంచి ప్రావీణ్యం ఉందన్న విషయం విదితమే. అనసూయా దేవి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆమె 1920 మే 12న కాకినాడలో జన్మించారు. అనసూయా దేవికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈమె ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు. ఆమె మృతిపై పలువురు సాహిత్యవేత్తలు, రాజకీయ నేతలు, కళాకారులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.