చెన్నై: ఐపిఎల్ 12వ సీజన్ లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 70 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ఆదిలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9)లు బెంగళూరు పతనాన్ని శాసించారు.
వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కోహ్లీతోపాటు మిగతా ఆటగాళ్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (29) మాత్రమే రెండెకల స్కోరు చేశాడు. దీంతో బెంగళూరు జట్టు 17.1 ఓవర్లలోనే 70 పరుగులకు ఆలౌటైంది.