గుర్గావ్‌లో దారుణం : ముస్లిం కుటుంబంపై అల్లరి మూకల దాడి

SMTV Desk 2019-03-23 16:47:17  Gurgaons Muslim family, new delhi, Dhamaspur, Muslim Family beaten by armed mob

మార్చ్ 23: రాజధాని ఢిల్లీ సమీపంలో హోలీ రోజు దారుణం చోటు చేసుకుంది. గురుగ్రామ్‌ లో ఓ ముస్లిం కుంటుంబంపై అల్లరి మూకదాడి జరిగింది. ధమ్సాపూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ సాజిద్‌ ఇంట్లోకి చొరబడిన 20 మంది యువకులు దాడికి పాల్పడ్డారు. ఇంటిపై రాళ్లు విసిరి.. కుటుంబం మొత్తాన్ని చితకబాదారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాల ప్రకారం...ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌ సాజిద్‌ గుర్గావ్‌లోని బోండోసి ప్రాంతంలో భార్య సమీనా, ఆరుగురు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. గురువారం హోలీ కావడంతో.. సాజిద్ బంధువులు కొందరు ఇంటికి వచ్చారు. సెలవు కావడంతో సాజిద్ పిల్లలు, బంధువుల పిల్లలు కలిసి సరదాగా ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారు. ఈలోపే స్థానికులైన కొందరు యువకులు వచ్చి క్రికెట్ ఆడకుండా అడ్డుకున్నారు. ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని.. ఇక్కడ కాదు పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ ఆడుకోండంటూ యువకులు బెదిరించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ నుంచి తప్పించుకుని సాజిద్, తన కుమారులు, మేనళ్లు ఇంటికి వెళ్లిపోయారు. ఈ గొడవ జరిగిన కొద్దిసేపటి తర్వాత సాజిద్ ఇంటిపైకి 20మంది యువకులు దూసుకొచ్చారు. ఇంటిపైకి రాళ్లు విసిరి.. లోపలికి చొరబడ్డారు. ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న సాజిద్, అతడి కుమారులు, మేనళ్లులపై దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. తమను కొట్టొద్దని వేడుకున్నా వదల్లేదు. తమను కాపాడాలంటూ వేడుకున్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో నలుగురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.