బెంగళూరు, మార్చ్ 22: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్గత విబేధాలు ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ నేతలు మునియప్ప, రమేశ్ కుమార్ మధ్య కొద్దిరోజులుగా లోక్సభ నియోజకవర్గం విషయమై మాటల యుద్ధం నడుస్తోంది. అయితే గతంలో ఈ వివాదంపై మునియప్ప స్పందిస్తూ.. ‘రమేశ్ కుమార్కు నాకు మధ్య విభేదాలు ఏం లేవు. మేమిద్దరం భార్య, భర్తల్లాంటోళ్లం’అని అన్నారు. ఈ మాటలు విన్న రమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను మగాళ్లతో పడుకోను. నాకు ఓ భార్య ఉంది. ఆయనకు ఆసక్తి ఉందేమో.. నాకు లేదు’ అని ఘాటుగా స్పందించారు. దీనిపై మునియప్ప ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ కోలర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై చాలా కాలంగా గొడవ పడుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఏడుసార్లు ఎంపీగా గెలిచిన మునియ్పకు మళ్లీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపనుంది. ఈ నేపథ్యంలో రమేశ్ కుమార్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.