ఇరాక్‌లో పండగ పూట విషాదం...పడవ మునిగి 100 మంది మృతి

SMTV Desk 2019-03-22 16:25:55  iraq, Iraqi city of Mosul, A boat accident on the Tigris River in Iraq

ఇరాక్, మార్చ్ 22: మోసుల్‌కు సమీపంలోని టైగ్రిస్ నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. అయితే కొత్త సంవత్సరంతో పాటు కొత్త రుతువు ప్రవేశించిన సమయంలో కుర్దులు ‘నౌరుజ్’ అనే పండుగను జరుపుకుంటారు. అయితే ఈ వేడుకను జరుపుకోవడానికి ఉమ్ రబేయిన్ ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని మోసుల్ నార్త్ నినెవె ప్రావిన్స్‌లోని సివిల్ డిఫెన్స్ ప్రెసిడెంట్, కల్నల్ హుస్సామ్ ఖలీల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో 61మంది మహిళలు, 19 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 55 మందిని రక్షించామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని రెస్క్యూ టీమ్స్ తెలిపాయి. మోసుల్ డ్యామ్ నుంచి ఇటీవల నీటిని విడుదల చేయడంతో టైగ్రిస్ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. వర్షాలు కూడా కురుస్తుండటంతో నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో నీటికి ఎదురువెళ్లడం ప్రమాదకరమని హెచ్చరికలు జారీచేసినా పడవ నిర్వాహకులు పెడచెవిన పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. నదిలో ప్రవాహానికి ఎదురుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ఉమ్ రబేయిన్ ద్వీపం ఉంది. ఇక్కడికి వెళ్తూనే ఈ ప్రమాదం జరిగింది.