వాషింగ్టన్, మార్చ్ 22: భారత్-అమెరికాల మధ్య సంబంధాలు భారత దేశ ప్రధాని మోదీ హయంలో మరింత బలపడ్డాయి అని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంతేకాక రానున్న లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ సంబంధాలు మరింత బలపడుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 2017లో మోదీ అమెరికా పర్యటన కూడా సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ మధ్య విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్ గోఖలే జరిపిన పర్యటన వాటికి కొనసాగింపేనని ఆయన అభిప్రాయపడ్డారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో నుంచి అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ వరకూ ప్రతి ఒక్కరితో గోఖలే కీలక చర్చలు జరిపారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా.. భారత్తో సత్సంబంధాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. వ్యూహాత్మకంగా భారత్తో బంధం అమెరికాకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ఇండోపసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక కదలికలకు భారత్ నుంచి తోడ్పాటు లభించడం వైపు దృష్టి సారించామని తెలిపారు.