ఇస్తాంబుల్, మార్చ్ 21: త్వరలో ఎయిర్బస్ విమానాలను ఇండిగో ఎయిర్లైన్స్ కొనుగోలు చేయనుంది. దాదాపు 20 నుంచి 25 ఎయిర్బస్ ఎ321 విమానాలను కొనుగోలు చేసేందుకు ఇండిగో రంగం సిద్దం చేసుకుంది. రానున్న కాలంలో అంతర్జాతీయ విమానసర్వీసులను ఈ సంస్థ విస్తరించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో 48 విమానాలను తీసుకోనుంది. వీటిల్లో 25 ఎ 321 మోడళ్లను తీసుకోగా.. మిగిలినవి ఎ320 మోడల్ను తీసుకోనుంది. ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విల్లీ బౌల్టర్ బుధవారం ఇస్తాంబుల్లోని ఇండిగో మెయిడెన్ ఫ్లైట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతుం రోజుకో సర్వీసును నడుపుతున్నాం. ఈ నెల తర్వాత నుంచి రెండో సర్వీసును కూడా ఏర్పాటు చేస్తాము.మధ్యశ్రేణి దూరాలకు సర్వీసులను పెంచుతాము. చైనా, వియత్నాం, సౌదీ మార్గాలను కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పటికే గాట్విక్లో స్లాట్ వచ్చినా వాటిని వినియోగించుకోలేకపోయాము’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఇండిగోకు టర్కిస్ ఎయిర్లైన్స్తో ఒప్పందం ఉంది.