నంద్యాల, ఆగస్ట్ 10: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో ఇటు అధికార టీడీపీ , అటు ప్రతిపక్ష వైసీపీలు జోరు పెంచాయి. రోజుకో నాటకీయ పరిణామాల మధ్య ప్రచారాలు సాగిపోతున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల ఎన్నికల్లో తను ఎవరికి మద్దతు ఇస్తారనేది ఇంకా వెల్లడించలేదు. కాగా, మద్దతు ఎవరికి ప్రకటించాలనే సందిగ్ధంలో జనసేన అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఒకవేళ టీడీపీకి మద్దతిస్తే జనసేన పార్టీకి ప్లస్సా? మైనస్సా? అన్న విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యతో పవన్, చంద్రబాబు దగ్గరైన విషయం తెలిసిందే. అయినప్పటికీ మద్దతు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల మంత్రి భూమా అఖిల ప్రియ పవన్ మద్దతు టీడీపీదే అని ప్రకటించడం గమనార్హం.