అమరావతి, మార్చ్ 20: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం తన కుమార్తెతో కలిసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి కొన్నాళ్ల కిందట టిడీపీలో చేరారు.
అయితే, ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ అధినాయకత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. చివరికి నంద్యాల ఎంపీ టికెట్ ను మాండ్ర శివానందరెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్పీవై రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో, జనసేన వ్యూహకర్తలు అదను చూసి రంగంలోకి ఎస్పీవై రెడ్డి వంటి బలమైన నేతను పార్టీలోకి ఆకర్షించగలిగారు.