వేలూరు, జూన్ 1 : పెళ్లి పీటలపై వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నను పక్కకు తోసేసి తమ్ముడు తాళి కట్టిన సంఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో జరిగింది. వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు సెల్లరైపట్టికి చెందిన కామరాజ్కు రంజిత్, రాజేష్, వినోద్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్కు మధురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. గురువారం ఉదయం ఇలవంపట్టి వెన్కల్ ప్రాంతంలోని మురుగన్ ఆలయంలో పెళ్ళి ఏర్పాట్లు జరిగాయి. వధూవరులను పెళ్లి పీటలపై కూర్చోపెట్టి పురోహితులు మంగళసూత్రాన్ని వరుడి చేతికిచ్చి వధువు మెడలో కట్టమని చెబుతుండగా, వినోద్ పీటలపై ఉన్న అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి పెళ్ళికూతురు మెడలో కట్టాడు. దీంతో బంధుమిత్రులు, తల్లిదండ్రులు కోపోద్రిక్తులై వినోద్ను చితకబాదారు. ఆ తరువాత వినోద్ను, వధువును విచారించగా రాజేష్కు పెళ్లి చూపులు చూస్తుండగానే వినోద్, వధువు ఇద్దరూ ప్రేమించుకున్నారనే విషయం తెలిసింది. వరుడు రాజేష్ ఆవేదనకు గురై కంటతడితో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.