న్యూఢిల్లీ, మార్చ్ 20: ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పరిస్థితి మరింత విషమించింది. సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక, తగిన నిధులు లేక తీవ్ర నష్టాల్లో కొట్టుకుపోతోంది. అయితే ఈ సంస్థ ప్రస్తుతం మూడింట ఒక వంతు విమానాలను మాత్రమే నడిపిస్తోందని అత్యవసర సమావేశమైన డిజిసిఎ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తాజాగ పేర్కొంది. వాస్తవానికి ఈ సంస్థకు 120 విమానాలు ఉండగా.. ప్రస్తుతం 41 విమానాలే నడుస్తున్నాయి. కొన్ని విమానాలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ తక్షణమే తగినంతగా నిధులు లేవు. ఇప్పటికే సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి, మరోవైపు డిబెంచర్ హోల్డర్లకు వడ్డీ చెల్లింపులు కూడా చేయలేదు. ఇదిలా ఉండగా జెట్ ఎదుర్కొంటున్న సమస్యలపై డిజిసిఎ తక్షణమే నివేదిక ఇవ్వాలని మంగళవారం కేంద్ర విమానయాన శాఖమంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు.