హైదరాబాద్, మార్చ్ 19: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్ అందించేందుకు ప్రముఖ రవాణా సేవా సంస్థ ఓలాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా రోడ్లు, రద్దీ నిర్వహణలో ప్రభుత్వానికి తోడ్పాటుగా డేటాను పంచుకోనుంది. నగరంలోని ట్రాఫిక్, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వానికి అండగా నిలిచేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో ఓలా సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా. ఓలా అందించే విలువైన డేటా ఇన్సైట్స్ భవిష్యత్ రవాణా మౌలిక వసతులను ఏర్పరచుకునేందుకు మార్గం సుగమం చేస్తాయని జయేష్ రంజన్ అభిప్రాయపడ్డారు. గుంతల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు నిర్మాణాల నాణ్యతను పర్యవేక్షించేందుకు, రోడ్డు మరమ్మతుల బడ్జెట్ ప్రాథమ్యాలను నిర్ణయించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని వివరించారు.