హైదరాబాద్, మార్చ్ 19: భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాభా జడేజా త్వరలో ప్రత్యక్ష రాజకీయల్లోకి రానున్నారు. త్వరలో జరుగబోయే లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీచేయనున్నారు. ఇటీవలే బీజేపీ పార్టీలో చేరిన ఆమె గుజరాత్లోని జామ్ నగర్ నుంచి సీటు ఆశిస్తున్నారు. కాగా ఇదే నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పటిదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ని బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనితో అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైనే ఉంది.
గుజరాత్లోని కర్ణిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా రివాభా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. క్షత్రియ వర్గీయురాలైన ఆమె ఇటీవల కర్ణిసేన మద్దతుతో బీజేపీ పార్టీలో చేరారు. జామ్నగర్లో ప్రస్తుతం భాజపా నాయకురాలు పూనమ్ మాదమ్ ఎంపీగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూనమ్.. ప్రముఖ కాంగ్రెస్ నేత, తన బంధువైన విక్రమ్ మాదమ్పై విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించింది. గుజరాత్లో మొత్తం 26 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా బలమైన నాయకులను బరిలోకి దింపి 2014 ఫలితాలను పునరావృతం చేయాలని గుజరాత్ బీజేపీ భావిస్తోంది.