ముంబై, మార్చ్ 18: భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన అభిమానుల పట్ల ఎంత చనువుగా ఉంటాడో తెలిసిందే. తాజాగా అతన్ని కౌగిలించుకునేందుకు స్టేడియంలోకి వచ్చిన తన అభిమానిని ఆటపట్టించిన వీడియో నెట్లో వైరల్ గా మారింది. ఐపీఎల్లో పాల్గొనేందుకు ‘చెన్నై సూపర్ కింగ్స్’ జట్టు ఇప్పటికే చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ..ఆదివారం చిదంబరం స్టేడియంలో ధోనికీ అభిమానికి మధ్య జరిగిన చిన్న సన్నివేశం ధోనీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ధోనీ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ అభిమాని సరాసరి మైదానంలోకి ప్రవేశించి ధోనీ వద్దకు పరిగెత్తాడు. అది గమనించిన ధోనీ అతడిని సరదాగా ఆటపట్టించాడు. ఇదంతా అక్కడ చాలా సరదాగా సాగింది. వెంటనే అక్కడకు చేరుకున్న స్టేడియం సిబ్బంది ఆ అభిమానిని లాక్కెళ్లారు. చివరికి అభిమానికి షేక్హ్యాండ్ ఇచ్చి ధోనీ నవ్వుకున్న వీడియో చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్లో పోస్టు చేసింది. దీంతో ఇదివైరల్గా మారి అభిమానులకు ధోనిని మరింత దగ్గర చేసింది.