అమరావతి, మార్చి 18: ఎన్నికల వేళ అక్రమార్కులను అడ్డుకోవడానికి ఆధునిక సాంకేతిక సాయం తీసుకుంటున్నారు. పౌరులు కూడా ఎన్నికల నియమావళి అక్రమాలను అధికారుల దృష్టికి ఇకపై తీసుకురావచ్చు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వీలుగా సి-విజిల్ యాప్ అందుబాటులోకి రానుంది. ఉల్లంఘనలకు పాల్పడిన ఘటనకు సంబంధించి ఫోటో, వీడియోను ఈ యాప్లో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
సోమవారం నుంచి ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు ఈసీ తెలిపింది. దానిపై ముఖ్య అధికారి రాష్ట్ర అదనపు అధికారులు, ఎన్నికల సంఘం నోడల్ అధికారులతో మాట్లాడారు. యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి ఇందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు స్పందించాలని, నిఘా బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. వారు స్పందించకపోతే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో వాటిని తొలగించి అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు.