పులివెందుల, మార్చ్ 18: కొద్దీ రోజుల క్రితం జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక మందిపై అనుమానాలు చెలరేగుతున్నాయి. పోలీసుల విచారణలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు చాలా మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
ఆ క్రమంలోనే హత్య కేసుకు సంబంధించి కొత్తగా వెలుగులోకి వచ్చిన పేరు కసునూరి పరమేశ్వర్రెడ్డి. వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితంగా వ్యవహరించే పరమేశ్వర్రెడ్డిపై గతంలో నేరస్తుడు. ఫ్యాక్షనిస్టు కూడా. గతంలో అనేక కేసులు కూడా పరమేశ్వర్రెడ్డిపై నమోదయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లోకి డైరెక్టుగా వెళ్లగలిగిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు యర్రం గంగిరెడ్డి, మరొకరు కసునూరి పరమేశ్వర్రెడ్డి.
వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసుల ప్రధానంగా అనుమానిస్తున్న పరమేశ్వర్రెడ్డికి అనారోగ్యంగా ఉండటంతో ఆయన్ను కడపలోని ఆస్పత్రిలో చూపించేందుకు తీసుకెళ్లారని స్థానికులు చెప్పారు. ఆ విషయం కూడా తమకు పరమేశ్వర్రెడ్డి భార్యే చెప్పిందని వారు వెల్లడించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు నాటి అర్ధరాత్రి పూట పరమేశ్వర్రెడ్డి భార్య తమ సొంత ఇంటికొచ్చి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తకు బట్టలు మార్చాల్సి ఉందని, బట్టలు తీసుకెళ్లేందుకు ఇంటికొచ్చానంటూ తమతో చెప్పిందని స్థానికులు చెప్పారు.