జమ్మూకాశ్మీర్‌లో కొత్త పార్టీ..

SMTV Desk 2019-03-18 08:29:39  jammu kashmir,

జమ్మూ కాశ్మీర్‌లో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంటోంది. ఆ పార్టీని స్థాపిస్తోంది ఎవరో కాదు మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్. ఆ పార్టీ పేరు జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్. 2010 సివిల్స్‌ టాపర్ అయిన ఫైజల్ ఆదివారం తన రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రాజ్‌బాగ్ పట్టణంలోని గిండున్ గ్రౌండ్‌లో పార్టీని ఆవిష్కరించనున్నట్టు ఫైజల్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహార తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు.. ‘కేంద్రం కీలక ప్రభుత్వ సంస్థలను నాశనం చేసేలా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లిం, దళితులపై దాడులు అనేకమయ్యాయి. అదే నిత్యకృత్యమైంది. అందుకే కొత్త పార్టీ ఇక్కడ అవసరం అనిపించింది’ అని పేర్కొన్నారు ఫైజల్.

కశ్మీరీలపై నిరాటంకంగా కొనసాగుతున్న ఆకృత్యాలు, అణచివేతను నిరసిస్తూ యూపీఎస్సీ 2010 బ్యాచ్ టాపర్ అయిన ఫైజల్.. ఐఏఎస్ పదవికి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవినీతిరహిత, పారదర్శక రాజకీయాల కోసం తనకు మద్దతుగా నిలువాలని కొంతకాలంగా యువతతో పాటు వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్‌లో శాంతిని కోరుకుంటున్న పలువురు యువనాయకులు ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆయన ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.