ముంబై మార్చ్ 17: 1947కి ముందు పాకిస్థాన్ అనేది లేదని.. అప్పటివరకు అది హిందూస్థాన్లో ఉండేదని ప్రజలు చెబుతుంటారు. మళ్లీ 2025 తర్వాత పాకిస్థాన్ హిందూస్థాన్లో భాగమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్. ముంబయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘2025 తర్వాత పాకిస్థాన్.. భారత్లో అంతర్భాగంగా మారిపోతుంది. మరికొన్నేళ్ల తర్వాత పాకిస్థాన్ అనే దేశం ఉండకపోవచ్చు. కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో మనవాళ్లు ఎంచక్కా భూములు కొనుక్కోవచ్చు. అక్కడ వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. మన దేశం గురించి వ్యతిరేకంగా, పాక్కు సానుకూలంగా మాట్లాడే నసీరుద్దీన్ అన్సారీ, నవజ్యోత్ సిద్ధూ లాంటి దేశద్రోహులను కఠినంగా శిక్షించాలి. దేశద్రోహులు జేఎన్యూలో ఉన్నా సరే, మహారాష్ట్రలో ఉన్నా సరే శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకురావాలి’ అని ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యానించారు.