ముంబై, మార్చ్ 16: గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన భారతదేశ రూపాయి విలువ గత ఆరు రోజుల నుండి బలపడుతూ వస్తోంది. ఈ రోజు కూడా ఇదే రీతిలో ట్రేడ్ నమోదయ్యింది. డాలరుతో మారకంలో ట్రేడింగ్ ప్రారంభంలోనే పెరిగింది. ఇంటర్బ్యాంకు ఫోరెక్స్ మార్కెట్లో 24 పైసలు పెరిగి రూ.69.10కు చేరింది. ఈ మధ్యకాలంలో కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు ర్యాలీబాటలో సాగుతున్నాయి. దీనికితోడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్స్లో భారీగా పెట్టుబడులకు దిగుతున్నారు. అలాగే రిజర్వ్ బ్యాంకు ఒపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా వ్యవస్థలో లిక్విడిటీని పంప్ చేస్తోంది. విదేశీ మారకం స్వాపింగ్ ద్వారా 5 బిలియన్ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గురువారం ఆర్బిఐ తెలియచేసింది. ఇలాంటి పలు సానుకూల అంశాలు రూపాయికి బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్పిఐలు దేశీయ కేపిటల్ మార్కెటోల నికరంగా రూ.2700కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. దీనికితోడు ఓపెన్ మార్కెట్ద్వారా రిజర్వ్ బ్యాంకు కొద్ది రోజులుగా లిక్విడిటీని మెరుగుపరచడం కూడా రూపాయికి బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.