న్యూఢిల్లీ, మార్చ్ 15: భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తాను లోక్పాల్ ఎంపిక కమిటి సమావేశానికి హాజరు కావడం లేదని ఓ లేఖ రాశారు. ఈ సమావేశానికి తనని ప్రత్యేక ఆహ్వానితునిగగా ఆహ్వానించడం వల్లే హాజరు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. లోక్పాల్ ఎంపిక కమిటీ సభ్యుల విషయంపై పలు సవరణలు చేసిన తరవాతే తాను సమావేశానికి హాజరు అవుతానని తేల్చి చెప్పారు. ప్రత్యేక ఆహ్వానితునిగా పరిగణించడం వల్ల చర్చలో తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఉండదని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షంలోని అతిపెద్ద పార్టీకి చెందిన వ్యక్తిని సభ్యునిగా చేర్చేలా లోక్పాల్ చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత అందుకు అనుగుణంగా సవరణలు చేయడంపై ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. లోక్పాల్ ఎంపికలో ప్రతిపక్ష పార్టీకి స్థానం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖర్గే ఆరోపించారు. లోక్పాల్ నియామకంపై ఎంపిక కమిటీ సమావేశమయ్యే తేదీలను తెలపాలని మార్చి 7న కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకుగానూ పది రోజుల గడువు విధించింది.